No products in the cart.
డిసెంబర్ 15 – ప్రభువే స్వాస్థ్యము!
“ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే”(సంఖ్యా.18:20).
ప్రభువే మీయొక్క స్వాస్థ్యము. ఆయనే మీయొక్క భాగము. ఆయనే నిత్యమును మీతోకూడ ఉండువాడు. అనేకులు ఆస్తులను స్వాస్థ్యముగా ఎంచుదురు. చదువులను, ప్రఖ్యాతులను స్వాస్థ్యముగా ఎంచుదురు. మరికొందరైతే లోకము యొక్క సంపదలను, పరపతులను, గొప్పతనములను స్వాస్థ్యముగా ఎంచుదురు. అయితే ప్రభువు, “నీ పాలును నీ స్వాస్థ్యము నేనే” అని సెలవిచ్చుచున్నాడు.
పాత నిబంధనయందు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు కనానును స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందు నిమిత్తమై ఐగుప్తును విడిచిపెట్టవలసిన దాయెను. ఎర్ర సముద్రము గుండా దాటి వెళ్ళవలసినదై యుండెను. నలభై సంవత్సరములు అరణ్యమందు నడవవలసినదై యుండెను. సినాయి కొండయందు అగ్నిలో నుండి నూతన శాసనములను వారు పొందుకొన వలసినదై యుండెను. అదియు గాక, మేఘస్తంభముతోను అగ్నిస్తంభముతోను త్రోవ నడిపించవలసినదై యుండెను.
అదే విధముగా మీరు ప్రభువును స్వతంత్రించు కొనవలెను అంటే, మొదటిగా అశాశ్వతమైన పాపపు సంతోషములను విడిచిపెట్ట వలసినది అవశ్యమైయున్నది. ఎర్ర సముద్రము గుండా బాప్తీస్మము పొందుకొన వలసినది అవశ్యమైయున్నది. మీరు పరిశుద్థాత్మతోను, అగ్నితోను అభిషేకింపబడ వలసినది అవశ్యమైయున్నది. అదియుగాక, మేఘస్తంభమైయున్న లేఖన వాక్యము ద్వారాను, అగ్నిస్తంభమైయున్న పరిశుద్ధాత్ముని ద్వారాను, మీరు నడిపించబడ వలసినది అవశ్యమైయున్నది. అప్పుడు మీరు ప్రభువును స్వాస్థ్యముగా పొందుకొందురు.
ఒకవేళ ఇట్టి అరణ్యమయమైన త్రోవయందు భయముతోను, ప్రతిష్ఠతోను దాటివచ్చుట కొంత కష్టమై ఉండినను, మీ ఎదుట ఉంచబడియున్న స్వాస్థ్యముగా నుండు ప్రభువు మిమ్ములను త్రోవనడిపించుకొని వెళ్ళుటకు శక్తి గలవాడైయున్నాడు. అపోస్తులుడైన పౌలు వ్రాయుచున్నాడు, “తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, క్రీస్తు యేసునందు స్వాస్థ్యముగా ఏర్పరచెను”(ఎఫెసీ.1:12). క్రీస్తు మీకు పాలును స్వాస్థ్యముగా ఉండుట ఎంతటి గొప్ప భాగ్యము! క్రీస్తును మీరు స్వతంత్రించు కొన్నప్పుడు, ఆయన యొక్క సమస్త ఆశీర్వాదములకును, కృపలకును తోటీవారసులై యున్నారు.
మీ యొక్క కనులు స్వాస్థ్యమైయున్న ప్రభువుపైనను, పరలోకపు రాజ్యముపైనను ఎల్లప్పుడును చూచుచున్నదై ఉండవలెను. పోస్టులుడైన పౌలు వ్రాయుచున్నప్పుడు ఆ స్వాస్థ్యమును తన తలంపునందు కలిగినవాడై, ఆ స్వాస్థ్యమును చూచుచు ముందుకు సాగి వెళ్ళెను. ఆయన వ్రాయుచున్నాడు: “తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను”(కొలొస్స.1:12). దేవుని బిడ్డలారా, ఆ స్వాస్థ్యమును చూచుచు విశ్వాసముతోను, పట్టు విడవని ప్రయాసముతోను ముందుకు సాగిపోవుడి
నేటి ధ్యానమునకై: “మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి… కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును”(హెబ్రీ.10:34,35).